ఇంగ్లండ్ టాపార్డర్ ను దెబ్బతీసిన భారత పేసర్లు.. 87 పరుగులకే 4 వికెట్లు డౌన్

  • లార్డ్స్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • నేడు ఆటకు నాలుగో రోజు
  • లంచ్ విరామానికి ఇంగ్లండ్ స్కోరు 4 వికెట్లకు 98 పరుగులు
  • రెండు వికెట్లు తీసిన సిరాజ్... నితీశ్ కు 1, ఆకాశ్ దీప్ కు 1 వికెట్
లార్డ్స్ టెస్టులో టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించారు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టాపార్డర్ ను దెబ్బతీశారు. ఓ దశలో ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్ దీప్ 1 వికెట్ పడగొట్టారు. ఇవాళ ఆటకు నాలుగో రోజు. 

ప్రస్తుతం లంచ్ విరామం కాగా, ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. జో రూట్ 17, కెప్టెన్ బెన్ స్టోక్స్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలీ 22, బెన్ డకెట్ 12 పరుగులు చేయగా... ఓలీ పోప్ 4, హ్యారీ బ్రూక్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా... టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో మ్యాచ్ పై ఆసక్తి రెట్టింపైంది.

నిన్న మూడో రోజు ఆట చివర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీతో టీమిండియా ఆటగాళ్లు గొడవపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇవాళ క్రాలీ వికెట్ తీసిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి అదిరిపోయే సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

Nitish Kumar Reddy
India vs England
India
England
Lords Test
Mohammed Siraj
Cricket
Jack Crawley
Akash Deep
Ben Stokes

More Telugu News